కోవెలకుంట్ల: పట్టణ శివారులోని వెలగటూరు రస్తాలో జుర్రేరు వాగుకు చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి చెందాడు. కోవెలకుంట్ల పోలీసులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన బాలకృష్ణ(32) అదివారం చేపలు పట్టుకునేందుకు బైక్పై జుర్రేరు వాగు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టుకునే తరుణంలో ప్రమాదవశాత్తు వాగు నీటి గుంతలో మునిగిపోయాడు. గుంత లోతుగా ఉండటంతో పాటు పూడిక పేరుకు పోవడంతో అందులో చిక్కుకుపోయాడు. సాయంత్రం అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు వాగు వద్దకు చేరుకోగా ఒడ్డున బైక్, చెప్పులు ఉండటంతో నీటిలో పడి పోయి ఉంటాడని భావించి ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వాగులో బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


