కొత్తూరులో సినిమా డైరెక్టర్ సురేందర్రెడ్డి
పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సినీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పూజలు చేశారు. అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ధ్రువ, సైరా వంటి చిత్రాలకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. పలువురు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు.
పాల కోసం వస్తూ..
మహానంది: జీవనోపాధి నిమిత్తం వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఝార్ఖండ్ రాష్ట్రంలోని అఫదిమడూరి గ్రామానికి చెందిన పవన్(26) గాజులపల్లె రైల్వేస్టేషన్ వద్ద ఉన్న నవగ్రహాల ఆలయంలో పనిచేస్తున్నాడు. ఆలయానికి దగ్గరలోని ఎంసీఫారం వద్ద ఆదివారం ఉదయం పాలు తెచ్చేందుకు బైక్పై వెళ్తుండగా బుక్కాపురం గ్రామానికి చెందిన షేక్ జమాల్ బాషా బొలొరో ఢీకొంది. ఈ ఘటనలో పవన్ తీవ్రంగా గాయపడటంతో కోలుకోలేక మృతి చెందాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ అదృశ్యం
కోడుమూరు రూరల్: కొత్తూరు గ్రామానికి చెందిన 33 సంవత్సరాల వితంతువు మల్లెపూలు లక్ష్మి కన్పించకుండా పోయినట్లు ఆమె తల్లి బైరిపోగు తిరుపాలమ్మ కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మల్లెపూలు లక్ష్మీ అనే మహిళకు 11 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో కొత్తూరు గ్రామాన్ని వదిలి పుట్టినిల్లైన గూడూరు మండలం మునుగాల గ్రామానికి వెళ్లిపోయింది. అయితే ఆరు నెలల కిందట లక్ష్మి తిరిగి కొత్తూరు చేరుకుని అక్కడే కుమారిడితో పాటు నివాసముంటోంది. ఈ నేపథ్యంలో గత శనివారం కోడుమూరుకు సంతకు వచ్చిన లక్ష్మి తిరిగి ఇంటికి పోలేదు. అయితే కోడుమూరులోని కొత్తబస్టాండ్ పిండి గిర్ని వద్ద నుంచి ఆడబిడ్డ భర్తకు ఫోన్చేసి తనను ఇద్దరు వ్యక్తులు వెంటాడుతున్నారని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మి తల్లి బైరిపోగు తిరుపాలమ్మ తన కుమార్తె కన్పించకుండా పోయిన విషయాన్ని ఆదివారం కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
కొత్తూరులో సినిమా డైరెక్టర్ సురేందర్రెడ్డి


