
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు టికెట్లు పొంది స్పర్శ దర్శనం చేసుకున్నారు.
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల(న్యూటౌన్): స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
శ్రీశైలం డ్యామ్కు
పెరుగుతున్న వరద
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరదప్రవాహం పెరుగుతుంది. కృష్ణానది పరీవాహకంలో కురుస్తున్న వర్షాల వలన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంకు వరదనీరు వచ్చి చేరుతుంది. ఆదివారం సాయంత్రానికి ఎగువ ప్రాజెక్ట్ల నుంచి 41,944 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో 62.4320 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, డ్యాం నీటిమట్టం 840.40 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయానికి 34,819 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 6,647 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 0.544 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 2.588 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు.
కోసిగిలో చిరుత పులి
● బంధించిన అటవీశాఖ అధికారులు
కోసిగి: మండల కేంద్రమైన కోసిగిలో ఆదివారం చిరుత పులి కలకలం రేపింది. స్థానిక బసవన్న కొండ దిగువ భాగంలోని ఎర్రవంకలో నడుచుకుంటూ వెళుతూ రైతులకు కనిపించింది. ఎర్రవాగులో ఎటూ కదలకుండా మత్తులో ఉండగా గుర్తించి ఎస్ఐ హనుమంతురెడ్డి సమాచారం అందించారు. చిరుతపులికి హాని కల్గించకుండా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఫారెస్టు ఆఫీసర్ శ్యామల, స్క్వాడ్ డీఎఫ్ఓ రవిశంకర్, ఆదోని ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ తేజస్వీ అక్కడి చేరుకుని రైతుల సహాయంతో చిరుతపులిని బోనులో బంధించారు. దానిని మత్తులోనుంచి బయటపడేందుకు నీళ్లను పోసి వాహనంలో తరలించారు. కొండ ప్రాంత నుంచి నీళ్లు తాగేందుకు చిరుతపులి కిందకు వచ్చిందని, మత్తులో ఉండడానికి కారణాలు వైద్య పరీక్ష అనంతరం తెలుస్తుందని డీఎఫ్ఓ తెలిపారు.
నేటి నుంచి వర్సిటీల్లో
పీజీ తరగతులు
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గత నెల 15 నుంచి వర్సిటీలకు వేసవి సెలవులు ప్రకటించారు. సెలవుల అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు మొదలు కానున్నాయి. మళ్లీ వర్సిటీల్లో విద్యార్థుల సందడి కనిపించనుంది.

శ్రీశైలంలో భక్తుల సందడి