
వృద్ధుల పట్ల నిర్లక్ష్యం విడనాడాలి
నంద్యాల(వ్యవసాయం): సమాజంలోని వృద్ధుల పట్ల ప్రేమ, గౌరవం, ఆదరణ చూపి వారిలో మానసిక ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత అందరిపై ఉందని మండల లీగల్ సెల్ చైర్మన్, 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ అన్నారు. ఆదివారం ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతునగర్లోని ప్రతిభ వృద్ధుల అనాథ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధాశ్రమంలోని వృద్ధుల ఆరోగ్య తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ వృద్ధులను శారీరక, మానసిక వేధింపులు కల్పించవద్దన్నారు. వారి వద్ద ఆస్తి, డబ్బు అపహరణ కాకుండా కాపాడుకునేందుకు చట్టాలు ఉన్నాయన్నారు. వారి అవసరాలను తీర్చడంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఏవైనా సమస్యలుంటే మండల్ లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయా న్ని అందజేస్తామని వృద్ధులకు సూచించారు. ఆయన వెంట మండల లీగల్ సెల్ న్యాయవాది గొండ్ల మద్దిలేటి, వృద్ధాశ్రమ నిర్వాహకులు నారాయణ, వార్డెన్ లక్ష్మీదేవి, లోక్ అదాలాత్ సిబ్బంది రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.