
మద్దతు ధర.. అరకొరే!
● 14 రకాల పంటలకు మద్దతు ధర
ప్రకటించిన కేంద్రం
● స్వల్ప పెంపుతోనే సరిపెట్టిన వైనం
● మద్దతు ధర పెంపు కంటితుడుపు చర్యే
● తడిసి మోపెడవుతున్న సాగు ఖర్చులు
● అన్నదాతను ఆదుకోని
కూటమి ప్రభుత్వం
● ఆందోళన చెందుతున్న రైతులు
కోవెలకుంట్ల: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మద్దతు ధర ప్రకటించింది. పెరిగిన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సేద్యాలు, కలుపు నివారణ, ఇతర వ్యయసాయ ఖర్చుల కనుగుణంగా మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ పంటల సాగు, పంట దిగుబడులకు, మద్దతు ధరకు ఏమాత్రం పొంతన లేకపోవడం అన్నదాతను నిరాశ పరుస్తోంది. ఆయా పంటలకు ప్రతి ఏటా మద్దతు ధర నామమాత్రంగా పెంచుతున్నారే తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 2.37 లక్షల హెక్టార్లలో రైతులు వరి, మొక్కజొన్న, మినుము, మిరప, జొన్న, పెసర, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, పొద్దుతిరుగుడు, ఉల్లి, సోయాచిక్కుడు, తదితర పంటలు సాగు చేయాల్సి ఉంది. 2025–26 ఖరీఫ్ సీజన్లోని 14 రకాల పంటలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఆయా పంటలకు ప్రకటించిన మద్దతు ధర ఆశాజన కంగా లేదని రైతులు పెదవి విరుస్తున్నారు.
ఐదేళ్లలో వరికి పెరిగిందే కొంతే!
జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి పంటకు మద్దతు ధర పెంచడంలో పెద్దగా తేడా లేకపోవడతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018–19 సాధారణ రకం వరికి క్వింటా ధర రూ. 1,750 ఉండగా ఏ–గ్రేడ్ రకానికి 1,777 ఉండగా, ప్రస్తుతం 2025–26 గాను సాధారణ రకానికి రూ. 2,369 ఏ–గ్రేడ్ రకానికి రూ. 2,389 నిర్ణయించారు. గతేడాదికంటే ఈ ఏడాది కేవలం రూ. 69 మాత్రమే పెరిగింది.
ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు
వ్యవసాయ రంగంలో ఏటా పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏటా సాగు ఖర్చులు ఎకరాకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలకనుగుణంగా మద్దతు ధర పెంచకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ యజమానులు సేద్యం ధరలను పెంచారు. కూలీలు, రసాయన ఎరువులు, పురుగు నివారణ మందులు, తదితర ఖర్చులు భారీగా పెరిగాయి. వరి సాధారణ రకం క్వింటా రూ. 2,300 ఉండగా ఈ ఏడాది రూ. 2,369కి పెంచారు. అలాగే గ్రేడ్ ఏ రకం 2,320 ఉండగా ,2389, జొన్న హైబ్రిడ్ రూ. 3371 ఉండగా రూ. 3699, మాల్ధండి రకం రూ. 3421 ఉండగా 3,749, సజ్జ రూ. 2,525 ఉండగా రూ. 2,775, రాగులు 4,290 ఉండగా రూ. 4866కి పెరిగింది. మద్దతు ధర అంతంత మాత్రంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగిన పంట మద్దతు (క్వింటం) ధరవివరాలు
పంటరకం పెరిగిన ధర (రూ..)
వరి సాధారణ 69
వరి ఏగ్రేడ్ 69
జొన్న హైబ్రీడ్ 328
జొన్న మాల్డాండి 328
సజ్జలు 150
మొక్కజొన్న 175
కందులు 450
పత్తి 589