
ఇదేమి పైశాచికం!
● బ్రాహ్మణదొడ్డిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఆస్తుల ధ్వంసం ● సర్పంచ్ గడ్డివామిని తగులబెట్టిన దుండగలు ● మరో వ్యక్తి ఇంటి బండలను పగులగొట్టిన వైనం
సి.బెళగల్: పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ బ్రాహ్మణదొడ్డి గ్రామంలో కొందరు దుండగులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. వారి ఆస్తులను తగులబెట్టడంతో పాటు ధ్వంసం చేస్తున్నారు. గ్రామంలో టీడీపీకి చెందిన వారు సర్పంచ్ దస్తగిరి, ఆయన అనుచర వర్గంపై వైరం పెంచుకుని తరచూ ఘర్షణకు దిగుతున్నారు. రెండు నెలల క్రితం సర్పంచ్, అతడి కుటుంబ, బంధువులు, సానుభూతిపరులపై భౌతిక దాడులు చేశారు. ఈక్రమంలో గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం రాత్రి దుండగులు దస్తగిరికి చెందిన చెందిన నాలుగు ట్రాక్టర్ల గడ్డివామిని (పశుగ్రాసంను) నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. అదేవిధంగా గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా ఉన్న మేకల రాముడు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న షెడ్ బండలను సైతం ధ్వంసం చేశారు. కాగా గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నా గ్రామంలో టీడీపీ వారు అరాచకాలు సృష్టిస్తూ, ఆస్తులను నాశనం చేస్తుండటంపై గ్రామంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గ్రామంలో అరాచకాలకు పాల్పడే దుంగడులను గుర్తించి, తమకు రక్షణ కల్పించాలని, అదేఽవిధంగా తమకు న్యాయం చేయాలని బాధితులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పరమేష్ నాయక్ తెలిపారు.

ఇదేమి పైశాచికం!