శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నీటిమట్టం బుధవారం 836 అడుగులకు చేరుకుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి జలాశయానికి 12,672 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి నాగార్జునసాగర్కు విద్యుత్ ఉత్పాదన అనంతరం 3,955 క్యూసెక్కుల నీరు విడుదల చేసున్నారు. కుడిగట్టు కేంద్రంలో 0.416, ఎడమగట్టు కేంద్రంలో 1.450 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. బుధవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 56.2910 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
టిక్కెట్ కౌంటర్ వద్ద
భక్తుల వాగ్వాదం
మహానంది: మహానంది దేవస్థానంలోని రూ.20 ఆర్జిత సేవా టిక్కెట్ కౌంటర్ వద్ద బుధవారం రాత్రి గోల్మాల్ చోటు చేసుకుంది. కొందరు భక్తులు మహానంది ఆలయానికి రాగా అక్కడ విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగి వచ్చిన భక్తులలో అందరికీ కాకుండా కొందరికే టిక్కెట్లు ఇచ్చి పంపిన ఘటనపై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ప్రాథమిక విచారణ చేసి సదరు ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సహకార శాఖలో పరిమితంగా బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): సహకార శాఖలో బదిలీలు పరిమితంగా జరిగాయి. నంద్యాల సబ్ డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉన్న రాచయ్య కర్నూలు సబ్ డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్–1 బదిలీ అయ్యారు. నంద్యాల డిఎల్సీవో కార్యాలయం నుంచి సీనియర్ ఇన్స్పెక్టర్ సురేష్కుమార్బాబు కర్నూలు డిఎల్సీవో కార్యాలయానికి బదిలీ అయ్యారు. కర్నూలు డీఎల్సీవో కార్యాలయం నుంచి కేఎల్ఎన్ ప్రసాద్ నంద్యాల సబ్ డివిజన్కు బదిలీ అయ్యారు. డీసీఏవో కార్యాలయంలోమ ఉనన మహబూబ్దౌళ అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. సిద్దవటంలో ఉన్న రహమత్ ఆలీ కర్నూలు డీసీఏవో కార్యాలయానికి బదిలీ అయ్యారు.
చిన్నారిపై వీధి కుక్క దాడి
బేతంచెర్ల: పట్టణంలోని బోయపేట కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కదాడి చేసి గాయపరిచిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పట్టణంలోని బోయపేట కాలనీకి చెందిన మధు, రామాంజనేయులు కుమార్తె మమత తోటి పిల్లలతో కలిసి ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ ఉంది. ఒక్క సారిగా వీధి కుక్క మమతపై దాడి చేసి కుడి కాలు, చేతిపై కరిచి తీవ్రగాయాలు చేసింది. పక్కనున్న వారు కేకలు వేయడంతో కుక్క పారిపోయింది. చిన్నారిని వెంటనే స్థానిక వైద్య శాలకు తరలించి వైద్యం చేయించారు. మే నెల 2వ తేదీన హనుమాన్ నగర్ కాలనీల్లో 4 సంవత్సరాల చిన్నారి బాలుడు షేక్ మొహిద్దీన్ కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికై నా అధికారులు స్పందించి పట్టణంలోని వీధి కుక్కలను దూరంగా తరలించి చిన్నారులకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పశుసంవర్ధక శాఖలో
కొలిక్కిరాని బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు. వాస్తవానికి ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి తర్వాత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, ఏరియా హాస్పిటల్ ఏడీలు, డీడీల బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 13 మంది ఏడీల కు స్థానచలనం కలిగింది. ఇందులో ఐదుగురు ఇతర జిల్లాలకు వెళ్లగా.. ముగ్గురు ఇతర జిల్లాల నుంచి వస్తున్నారు. అయితే బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే కీలక స్థానాలకు బదిలీ చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంత్రికి తెలియకుండా డైరెక్టర్ బదిలీలను ఏకపక్షంగా చేశారనే ఫిర్యాదులు ఉన్నతస్థాయి దృష్టికి వెళ్లడంతో ఉత్తర్వులను నిలిపివేశారు. గురువారం ఉదయానికి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రూ. 58 కోట్లతో
‘గోరుకల్లు’ పనులు
పాణ్యం: గోరుకల్లు జలాశయం పెండింగ్ పనుల కోసం రూ.58కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, ఆర్థికశాఖ ఆమోదం రావాల్సి ఉందని నీటిపారుదశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జలాశయాన్ని పరిశీలించిన అనంతరం బుధవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నీటి నిల్వ కోసం రూ. 2.50కోట్లతో మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు.