ప్రతి కుటుంబానికి సంక్షేమ లబ్ధి
బనగానపల్లె రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పార్టీ, కులమతాలకు అతీతంగా ప్రతి కుటంబానికి సంక్షేమ లబ్ధి చేకూరిందని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బత్తులూరుపాడులో రూ.5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్, యనకండ్ల గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించిన సీసీ ఓపెన్ డ్రైవ్ విత్కవర్ స్లాట్, రూ.8 లక్షలతో నిర్మించిన మినరల్వాటర్ ప్లాంట్, రూ.23. 80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ.43 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, అక్రమార్జన కోసం నీరు చెట్టు పేరుతో దోపిడీకి పాల్పడ్డారన్నారు. గతంలో ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులు పనులు మానుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటి వద్దకే వస్తున్నాయన్నారు. ఎర్రబోతుల కుటుంబాన్ని విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డికి లేదన్నారు. కమీషన్ల కోసం సిమెంట్ కంపెనీలను బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి బీసీ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలోజెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి