పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
గరిడేపల్లి : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పొనుగోడు గ్రామంలో నిర్మించిన సంఘం భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగానే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి నేటికీ పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ వయసులో వారు తిరిగే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని నిర్మించిన సంఘం మండల కమిటీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుందరి నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతారామయ్య, సభ్యులు వెంకటమ్మ, చంద్రయ్య, బొట్ల రాంబాబు, శ్యాంసుందర్రెడ్డి, వేరేపెళ్లి శ్రీనివాసరావు, కోటయ్య పాల్గొన్నారు.


