
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం
మిర్యాలగూడ: గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంపై కోర్టుకు వెళ్తామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణ కమిటీ ముందు హరీష్రావు అన్ని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ అప్పులు మిగిల్చిపోయాడని, కాంగ్రెస్ ప్రభుత్వం 16నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఇటీవల రూ.5వేల కోట్లను ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. రూ.22వేల కోట్లతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదల కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల భారం పడిందన్నారు. రాబోయే మూడేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీళ్లు అందిస్తామన్నారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చెప్పిందని, ఆ దయ్యాలెవరో ఇంతవరకు బయటకు రాలేదన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి