నేడు రైతు నేస్తం | - | Sakshi
Sakshi News home page

నేడు రైతు నేస్తం

Jun 16 2025 7:03 AM | Updated on Jun 16 2025 7:03 AM

నేడు

నేడు రైతు నేస్తం

నల్లగొండ అగ్రికల్చర్‌ : రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోని 93 రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ ఆదివాకం ఒక ప్రకటనలో కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో ముఖాముఖి ఉంటుందని, కలెక్టర్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

కోర్టు కానిస్టేబుళ్లకు

ఎస్పీ అభినందన

నల్లగొండ : జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 16,460 కేసులు పరిష్కరించడంతో కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదివారం ఒక ప్రకటనలో అభినందించారు. రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్‌ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది కృషి చేశారని పేర్కొన్నారు. కక్షిదారులకు సమాచారం అందించి అవగాహన కల్పించి పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించడం అభినందనీయమని తెలిపారు.

మందుల దుకాణాల్లో తనిఖీలు చేయాలని ఆదేశం

నల్లగొండ టౌన్‌ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మందుల దుకాణాల్లో తనిఖీ చేయాలని ఔషధ నియంత్రణ ఏడీ దాస్‌ ఆదివారం ఆదేశించారు. శనివారం ‘సాక్షి’లో ‘మత్తుమందు మాఫియా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి సమగ్ర నివేదిక అందించాలని నల్లగొండ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. మత్తు మందులను విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

రజకుల మహాధర్నాను జయప్రదం చేయాలి

నార్కట్‌పల్లి : తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకు పెద్దులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రజక, నాయీబ్రాహ్మణ వృత్తిదారుల ఉచిత విద్యుత్‌ పథకం పెండింగ్‌ (బకాయిలు) కరెంటు బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. ఏడాది కాలంగా ఉచిత విద్యుత్‌ పథకానికి సంబంధించి రజకులకు రూ.187 కోట్లు, నాయీ బ్రాహ్మణులకు రూ.43 కోట్లు పెండింగ్‌ ఉందన్నారు. వివిధ సమస్యలపై నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

జల దోపిడీకే

బనకచర్ల ప్రాజెక్టు

సూర్యాపేట : గోదావరి నది మిగులు జలాలు, వరద జలాల పేరుతో తెలంగాణ నికర జలాలను దోపిడీ చేసేందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును రూపొందించిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్‌ విమర్శించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర నాయకత్వం కృష్ణ, గోదారి నదులపై అడ్డగోలుగా ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా దోచుకెళ్లారని మళ్లీ ఇప్పుడు గోదావరి నది నుంచి 200 టీఎంసీల నీళ్లను తరలించుకెళ్లడానికి బనకచర్ల ప్రాజెక్టు మొదలు పెట్టారన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్‌, కార్యదర్శి బొడ్డు శంకర్‌ గౌడ్‌, లీగల్‌ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ధరావత్‌ వీరేష్‌ నాయక్‌, డీఎల్‌ సెల్‌ జిల్లా కార్యదర్శి బొజ్జ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ

భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటశ్వరస్వామి దేవాలయం వద్ద అదివారం శ్రావణ నక్షత్రం సందర్భంగా భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధిఉత్సవ సేవ, రథోత్సవం నిర్వహించారు.

నేడు రైతు నేస్తం1
1/1

నేడు రైతు నేస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement