
చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా లేనట్లా!
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025
నల్లగొండ టూటౌన్ : మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. జూన్ నెల వచ్చినా జిల్లాకు ఎన్ని చేప పిల్లలు కావాలన్న వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు. ప్రతి సంవత్సరం మే నెలలోనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా మత్స్యశాఖ అధికారులను ఆదేశించేవారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉచిత చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా లేనట్లా అనే మీమాంస నెలకొంది.
1,160కి పైగా చెరువులు, కుంటలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని తెలుస్తోంది. వానాకాలం గనుక భారీ వర్షాలు కురిస్తే ఆగస్టు నెల నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రతిపాదనలు ఊసేలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1,160కి పైగానే ఉన్నాయి. వీటన్నింటిలో చేప పిల్లలు పోయాలంటే జిల్లాకు 5.90 కోట్ల చేప పిల్లలు అవసరం ఉంటుందని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 249 మత్స్య సొసైటీలు..
జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 249 మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ 249 సంఘాల్లో 28 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 60 వేల మందికి పైగా ఉచిత చేప పిల్లల ద్వారా జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది.
నాణ్యత లేని పిల్లలు..
మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్లల పంపిణీలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా కాంట్రాక్టర్లు లాభపడుతున్నారు తప్పితే మత్స్యకారులకు ప్రయోజనం లేకుండా పోయిందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో చేప పిల్లలు పోయడానికి కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను తేకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చేప పిల్లల లెక్కింపులో కూడా అక్రమాలకు పాల్పడుతూ ఇటు ప్రభుత్వాన్ని అటు మత్స్యకారుల కళ్లుగప్పి అందిన కాడికి దోచుకుంటున్నారనే విమర్శలు ప్రతి సంవత్సరం వస్తున్న విషయం తెలిసిందే. అక్రమాలు, నాణ్యమైన పిల్లలు సరఫరా చేయని కారణంగా ఉచిత చేప పిల్లలు కాకుండా తమకు నేరుగా నగదు అందించాలని మత్స్యకార సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరి ఉచిత చేప పిల్లల పథకాన్ని ఎత్తేస్తారా.. లేక నగదు పంపిణీ చేస్తారా..! అనే దానిపై ఎలాంటి సమాచారం మత్స్యశాఖ అధికారులు వద్ద కూడా లేదు.
న్యూస్రీల్
ఫ జిల్లాకు కావాల్సిన
చేప పిల్లలు 5.90 కోట్లు
ఫ ఇప్పటివరకు ప్రతిపాదనలు
తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం
ఫ అయోమయంలో మత్స్యకారులు