
సీజనల్ వ్యాధులను అరికట్టేదెలా..!
ఫ జిల్లా మలేరియా అధికారి, సీనియర్ ఎంటమాలజిస్ట్ పోస్టులు ఖాళీ
ఫ సిబ్బందిపై కొరవడిన పర్యవేక్షణ
ఫ కనిపించని వైద్య శిబిరాలు,
అవగాహన కార్యక్రమాలు
నల్లగొండ టౌన్ : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేది ఎవరనే ప్రశ్న జిల్లాలో తలెత్తుతోంది. ఆరు నెలలుగా మలేరియా అధికారి పోస్ట్ ఖాళీగా ఉంది. దాంతోపాటు అర్బన్ మలేరియా సీనియర్ ఎంటమాలజిస్ట్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. వర్షాకాలంలో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయి. ఈ వ్యాధులన్నింటిని అరికట్టాలంటే ప్రజల్లో జిల్లా మలేరియా విభాగం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దోమల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. దాంతోపాటు అర్బన్ మలేరియా సిబ్బంది ద్వారా నీటి కుంటలు, మురుగు కాల్వలు, పాడుబడిన నీటి గుంటల్లో దోమల నిర్మూలన కోసం మందులను స్ప్రే చేయాలి. డెంగీ, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో బాధితుల ద్వారా రక్త నమూనాలను సేకరించి వ్యాధులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల నుంచి ఇప్పటివరకు రెగ్యులర్ జిల్లా మలేరియా అధికారి పోస్టును ప్రభుత్వం భర్తీ చేయలేదు. జిల్లా మలేరియా ఇన్చార్జి అధికారిగా జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన జిల్లా మలేరియా అధికారిగా ఆ విభాగానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. అదనపు పనిభారం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నమోదవుతున్న మలేరియా కేసులు
జిల్లా వ్యాప్తంగా ఎక్కడ డెంగీ మలేరియా కేసులు నమోదైనా మలేరియా సిబ్బంది అక్కడికి వెళ్లి వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అంతేగాక క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమై జిల్లాలో అక్కడక్కడ డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. కానీ జిల్లా మలేరియా అధికారి లేకపోవడం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లా మలేరియా అధికారితో పాటు సీనియర్ ఎంటమాలజిస్టును నియమించి జిల్లాలో సీజనల్ వ్యాధులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.