మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లను చూపుతున్న నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి
నల్లగొండ క్రైం: నల్లగొండలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైద్యుడి సిఫారసు లేకుండా మత్తుకు సంబంధించిన స్పాస్మో ప్రాక్సివాస్ ప్లస్, అల్ట్రా కింగ్ టాబ్లెలెట్లు, ట్రామాడెక్స్ ఇంజక్షన్లు కలిగిన ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా కొత్త తరహాలో మత్తు మందుకు యువత బానిస అవుతున్నట్లు బయటపడింది. నిందితులను, మత్తు మందులను అమ్మిన వారిని అరెస్ట్ చేసి, వారి దగ్గర మత్తు మందులకు సంబంధించిన టాబ్లెట్స్, ఇంజక్షన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబందించి నల్లగొండ ఎస్పీ చందనాదీప్తి శుక్రవారం వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని రహ్మాన్బాగ్కు చెందిన మహ్మద్ జబీఉల్లా, ఎన్జీ కాలేజీ వెనుక బాగంలోని శ్రీనగర్కాలనీ చెందిన మహ్మద్ సల్మాన్ మత్తు మందులతో పట్టబడినట్లు తెలిపారు. వీరిద్దరు శివాజీనగర్లోని న్యూ హెల్త్కేర్ ఫార్మసీకి చెందిన యజమాని తౌడోజు నరేష్ వద్ద మత్తు మందులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. కొందరు యువకులు మత్తు టాబ్లెట్లను, ఇంజక్షన్లను తాము తీసుకోవడమే కాకుండా తమ ఇళ్లలో నిల్వ చేసుకుని ఇతరులకు కూడా విక్రయిస్తున్నారని ఎస్పీ చెప్పారు. ఈ మత్తు టాబ్లెట్లను మింగి పైనుంచి చక్కెర నీళ్లు తాగడం వల్ల ఎక్కువ మత్తు వస్తుందని, గంజాయి పీల్చిన దానికంటే ఎక్కువ మత్తులోకి జారుకుంటారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని, క్రయ, విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. మత్తు పదార్థాల సమాచార విషయంపై సమీప పోలీస్ స్టేషన్కు గానీ, 100 నంబర్కు డయల్ చేసి గానీ తెలియజేయాలని కోరారు. కొత్త తరహాలో మత్తుకు బానిస అవుతున్న యువతను కట్టడి చేసి మంచి మార్గంలో నడిపించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. నేరస్తులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన వన్టౌన్ సీఐ సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీధర్రెడ్డి, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ నల్లగొండలో పలువురి యువకుల
వద్ద మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన ఎస్పీ చందనాదీప్తి
Comments
Please login to add a commentAdd a comment