తెలకపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రో యాక్టివ్ సీఎం అని, కుల వ్యవస్థ నిర్మూలనకే 200 ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభిస్తున్నామని మల్లురవి అన్నారు. గురువారం ఆయన మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో పంచాంగ శ్రవణంలో పాల్గొని అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు కొనసాగుతున్నాయన్నారు. దక్షిణ తెలంగాణలో కల్వకుర్తి నుంచి గద్వాల వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేసే వరకు పాదయాత్ర చేస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ చేతకాని పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రైల్వే లైన్ కోసం బీజేపీ ఎంపీ డీకే అరుణ సహకరించాలని కోరారు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని, వాయిదా వేస్తూ సమావేశాలు సక్రమంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. తెలుగు సంవత్సరం సందర్భంగా రాంరెడ్డిపల్లి గ్రామంలో పొలంలో నాగలి దున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు చిన్నజంగయ్య, చంద్రశేఖర్, వల్లభ్రెడ్డి, మనోహర్రెడ్డి, ధర్మరాజు, నిరంజన్, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


