నాగర్కర్నూల్ రూరల్: అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను భారత్ రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాద దేశంతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల మూలంగా దేశ రైతాంగం బజార్లో పడే పరిస్థితి వచ్చిందన్నారు. దేశ రైతులు పండించే పంటలకు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో ముప్పు ఉందని, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఫలితంగా అమెరికా దిగుమతులు దేశంలో పెరిగిపోయని, మన దేశంలో సోయాబిన్, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలన్నీ పండించే రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. మన దేశం ఎగుమతి చేసే వస్తువులపై 18 శాతం పన్నులు వేస్తున్న అమెరికా ప్రభుత్వం తన దేశం దిగుమతి చేస్తున్న వస్తువులపై పన్ను లేకుండా దిగుమతి చేసుకోవడం ద్వారా మన రైతాంగం పండించిన పంటలకు రేటు రాక అప్పుల పాలు కావడమే తప్ప మరో మార్గం లేదని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పర్వతాలు, రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు శ్రీనివాస్, చింత ఆంజనేయులు, బి.ఆంజనేయులు, సభ్యులు రామయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


