కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పదో తరగతి పరీక్షలపై సీఎస్, డీఓ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులపై కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని, సిబ్బంది ఎవరూ కూడా మొబైల్ వినియోగించరాదని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రంలోకి ప్రవేశించే ముందు తమ మొబైల్ను వాహనాల్లోనే జమ చేయాలని సూచించారు. క్లెరికల్ సిబ్బంది, రిలీవర్లు పరీక్ష పూర్తయ్యే వరకు సీఎస్ గదిని విడిచిపెట్టకూడదన్నారు. ప్రశ్నపత్రాలను పోలీస్స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకురావడం, అలాగే పరీక్ష అనంతరం కేంద్రం నుంచి పోస్టాఫీసుకు పంపే సమయంలో తప్పనిసరిగా ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్రావు పాల్గొన్నారు.


