రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం.
– వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి
రాష్ట్ర బడ్జెట్లో సామాన్య ప్రజల సంక్షేమం, యువత అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో శుభపరిణామం. తెల్లరేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక భద్రత కలుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి నిధులు కేటాయించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ఉంది.
– యెన్నం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, మహబూబ్నగర్
రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతున్నారు. అయితే ఖర్చులో మాత్రం తేడా ఉంటోంది. ఎంత కేటాయించారన్నది కాకుండా ఎంత ఖర్చు చేశారో ముఖ్యం. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల కోసం సిద్ధం చేసిన డీపీఆర్లకు అనుగుణంగా సాగునీరు అందించాలి. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు అందించారు.. నీరు అందించకుండా పెండింగ్ ఉన్న భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. అంకెల గారడీ కాదు.. నీళ్లు కావాలి.
– రాఘవాచారి, కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును విస్మరిస్తోంది. అన్ని మాయమాటలు, బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల సమీకరణ ఎలా చేపడుతారో అర్థం కావడం లేదు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతారు. హామీలేమో అంచనాలకు అందకుండా ఇస్తున్నారు. ఇదెలా సాధ్యమవుతుందో వారే చెప్పాలి.
– హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొల్లాపూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో పేదలకు ఒరిగేది ఏమీ లేదు. బడ్జెట్లో రైతు భరోసా, రైతు బీమా వంటి అంశాలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టత కొరవడింది. వైద్య రంగానికి నిధులు తగ్గించడం బాధాకరం. విద్య, ఉపాధి అంశాలను పట్టించుకోలేదు. – ఫయాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ
●


