
నల్లగొండకు సాగునీరు తరలించడం అన్యాయం
కందనూలు: జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు అక్రమంగా సాగునీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసిందని, దీనిని అడ్డుకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్యెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్యమంత్రిని నిలదీయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అధికార పార్టీ నేతలకు ప్రాజెక్టులపై అవగాహన లేదని, ప్రజల కోసం పనిచేయకుండా స్వార్థం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అన్ని అనుమతులను సాధించడం జరిగిందని, తద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూపొందించిన పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్ ఆడించే ఆటగా పాలకులు పనిచేస్తున్నారని ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అందించవచ్చని, అందుకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి జీఓను కూడా విడుదల చేశారని దానిని పక్కన పెట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు చేస్తున్న కుట్రలతో ఉమ్మడి పాలమూరు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.