ధనుష్ నటించాల్సిన చిత్రం వర్దమాన నటుడు విదూను వరించింది. ఎస్.కార్తికేయన్కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్కు చెందిన స్క్వాడ్ స్టూడియో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 29 అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్రానికి రత్నకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు పేట, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విదూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా ప్రీతీ అస్రాణి నటిస్తున్నారు.
ఏడేళ్ల తర్వాత
శ్యాన్ రోల్డణ్ సంగీతాన్ని, మహేశ్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత కార్తికేయన్ మాట్లాడారు. తమ చిత్ర నిర్మాణ సంస్థను 2017 ప్రారంభించి తొలి ప్రయత్నంగా మేయాదమాన్ చిత్రాన్ని నిర్మించామన్నారు. ఆ తరువాత 17 చిత్రాలు చేశామని చెప్పారు. దర్శకుడు రత్నకుమార్తో సుమారు 7 ఏళ్ల తరువాత ఇప్పుడు 29 చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు.
30లోకి అడుగుపెడితే..
కొంత కాలం క్రితం ఆయన ఈ కథ చెప్పగా దయచేసి ఈ చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలని కోరానన్నారు. చిత్ర షూటింగ్ 85 శాతం పూర్తి అయ్యిందనీ, మరో నాలుగు రోజులు షూటింగ్ నిర్వహిస్తే పూర్తి అవుతుందన్నారు. చిత్ర దర్శకుడు రత్నకుమర్ మాట్లాడుతూ.. మనిషి వయసు 29 పూర్తి అయ్యి 30లోకి అడుగు పెడితే జాతకం మారిపోతుందన్నారు. అలాంటి ఒక యువకుడి ఇతివృత్తంతో తెరెకెక్కిస్తున్న చిత్రం 29 అని చెప్పారు.
ధనుష్ రిజెక్ట్
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ఈ కథను మేయాదమాన్ చిత్రం పూర్తి అయిన తరువాత దర్శకుడు రత్నకుమార్ తనకు చెప్పారన్నారు. దీన్ని నటుడు ధనుష్కు చెప్పగా ఆయని చాలా బాగుందన్నారు, కాకపోతే తాను ఇప్పుడు యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం వల్ల ఇందులో నటించలేనన్నారు. యువ నటుడు నటిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారన్నారు.
హీరోగా
అలా ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రత్నకుమార్.. విదూతో ఆడిషన్ నిర్వహించారన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రానికి ముందయితే ఈ మూవీలో విదూని హీరోగా తాను అంగీకరించేవాడిని కాదన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్, రెట్రో చిత్రంలో నటించి అతను తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారని చెప్పారు.


