హిట్టు పడితే యాక్టర్స్ను నెత్తిన పెట్టుకునే జనాలు ఫ్లాప్ రాగానే వారిని దారుణంగా విమర్శిస్తుంటారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లపై ఈ ట్రోలింగ్ తీవ్రస్థాయిలో ఉంటుంది. కథానాయికలనైతే రెండు మూడు ఫ్లాపులు రాగానే ఐరన్ లెగ్ అని ముద్రవేస్తారు. తనకు మరో మూవీ ఛాన్స్ వచ్చిందనగానే అయితే అది ఫ్లాప్ అవడం ఖాయం అని దారుణంగా మాట్లాడుతుంటారు.
వరుస ఫ్లాప్స్
ఇలాంటి ట్రోలింగ్ను కొన్నేళ్లుగా చవిచూస్తోంది శ్రీలీల. మాస్ జాతర, రాబిన్ హుడ్, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ, స్కంద.. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. తమిళంలో చేసిన పరాశక్తి కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తనను ఈ ఫ్లాప్ ట్యాగ్ నుంచి గట్టెక్కించలేకపోయింది.
వెళ్లిపోదామనుకున్నా..
అయితే ఈ ట్రోలింగ్ భరించలేక ఎప్పుడో సినిమాలు మానేయాలనుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే ఈ ట్రోల్స్కు విపరీతంగా భయపడ్డాను, బాధపడ్డాను, ఏడ్చేశాను. అమ్మా.. ఇదంతా నావల్ల అవుతుందా? కాలేజీకి తిరిగెళ్లిపోనా? అని అడిగాను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. కానీ, ఇప్పుడు వాటిని ఎదుర్కొనేంత ధైర్యం వచ్చింది అని పేర్కొంది.
అదే భయం
మరో హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. నాకు ఇప్పుడే కొంత భయంగా ఉంది. ఎందుకంటే ఇటీవలికాలంలోనే ఈ ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ఏదో ఒకటి అనేస్తున్నారు. అదే అసలు సమస్య! ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటాం. దాన్ని వాళ్లు చెడగొట్టేస్తున్నారన్న బాధ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా, శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది.


