
హారర్ సినిమాలు హిట్టయ్యాయంటే వరుసపెట్టి మరీ అవే తీస్తూ ఉంటారు. అదేవిధంగా యాక్షన్ మూవీ బ్లాక్బస్టర్ అయిందంటే అలాంటివే వరుసగా వదులుతూ ఉంటారు. ఈ ధోరణిలో మార్పు రావాలంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kahsyap). ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. కేజీఎఫ్, సలార్ సినిమాలు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరంతా చూశారుగా.. తర్వాత వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఒకేలా కనిపించేవి.
హింసపై ఫోకస్
యానిమల్ విషయానికి వస్తే ఇందులో హింస, రక్తపాతం బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమా రూ.900 కోట్లు సంపాదించింది. ఇది చూసిన ఫిలిం మేకర్స్ తమ చిత్రాల్లోనూ రెట్టింపు హింసను ప్రవేశపెట్టారు. కొన్నిసార్లు అవసరం ఉన్నా, లేకపోయినా బలవంతంగా వాటిని చొప్పించేవారు. వాళ్లు తప్పు దారిలో వెళ్లడం చూసి నాకు భయమేసేది అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడదే ట్రెండ్
ఇదే ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. బాహుబలి సినిమా తర్వాత అందరూ బడ్జెట్, స్పెషల్ ఎఫెక్ట్స్పైనే ఫోకస్ చేశారన్నాడు. భారీ బడ్జెట్ సినిమాలు తీయడమే ప్రస్తుతమున్న ట్రెండ్ అని, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. తాను కూడా సత్య సినిమాకు మరో రూ.5 కోట్లు ఎక్కువ పెట్టుంటే ఆ మూవీ సర్వనాశనమయ్యేదన్నాడు.
బాలీవుడ్కు గుడ్బై
బాలీవుడ్లో దర్శకుడిగా, నటుడిగా రాణించిన అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాడు. హిందీలో ప్రయోగాలు చేయడం కష్టమని, అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, అందుకే బాలీవుడ్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. పూర్తిగా దక్షిణాది సినిమాల్లోనే ఉంటానని తెలిపాడు. ఈయన ప్రస్తుతం అడివిశేష్ హీరోగా నటిస్తున్న డకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు.