పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ నా అదృష్టమైన నగరం. ఇక్కడే ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్ 150’ సెలబ్రేషన్స్ చేశాం. ఆర్టిస్ట్గా నేను ఎన్నో కథలు వింటాను. అందులో కొన్ని నచ్చుతాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంతమంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన సుకుమార్గారికి ధన్యవాదాలు.
బుచ్చిబాబు దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. నా సినిమాల లైబ్రరీలో ఈ చిత్రం టాప్లో నిలుస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టం, ప్రేమతో చేశాను. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది పడి లేచిన మనిషి ప్రయాణం. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇండియాలో టాప్ డైరెక్టర్స్ జాబితాలో నిలుస్తారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకుని పనిచేయడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అంటూ చరణ్ తన అభిమానులపై ప్రేమను వ్యక్తం చేశారు. హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులే దేవుళ్లు అని అమ్మ శ్రీదేవి తనకు చెప్పేదని గుర్తుచేసుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని డైలాగ్ను యాంకర్ సుమ జాన్వీతో చెప్పించారు. 
హిందీ నటుడు దివ్వేందు కూడా తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. నిర్మాత కిలారు వెంకట సతీష్ మాట్లాడుతూ తన సొంతూరు పెనమలూరు అని, ఇక్కడ ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏఆర్ రెహమాన్ నిర్వహించిన లైవ్ మ్యూజికల్ నైట్ సంగీత ప్రియులను అలరించింది. పెద్ది సినిమాలోని పాటలను ఆయన స్వయంగా పాడటమే కాకుండా స్టెప్పులు కూడా వేశారు. చికిరి చికిరి పాటకు ప్రేక్షకులతో నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోస్టర్ను ఈవెంట్ వేదికపై ఆవిష్కరించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్లో ఆడే జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


