రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
తాజాగా ఈ మూవీ గురించి బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ మాట్లాడారు. ధురందర్: ది రివెంజ్ ఫెయిల్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నారని వెల్లడించారు. అలా కోరుకున్న వారిలో స్టార్ డైరెక్టర్స్ సైతం ఉన్నారని కునాల్ కోహ్లా సంచలన కామెంట్స్ చేశారు. దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతమే ఫెయిల్ అవుతుందని ఊహల్లో తేలియాడారని అన్నారు. కానీ వారి అంచనాలకు విరుద్ధంగా ఈ మూవీ రాణించిందని పంచుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే వసూళ్ల వేటతో అదరగొట్టేసింది. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వెయ్యి కోట్లు వసూళ్లు చేసి సత్తా చాటింది.
కునాల్ కోహ్లీ మాట్లాడుతూ..'బాలీవుడ్ పరిశ్రమ మొత్తం సినిమాకు మద్దతు ఇవ్వకపోయినా ఆడుతోంది. ధురందర్కు బాలీవుడ్లో ఎవరూ కూడా మద్దతు ఇవ్వలేదు. అగ్రశ్రేణి దర్శకులు సైతం ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు. మొదటి సోమవారం నుంచే దురంధర్-2 ప్రదర్శన ఆగిపోతుందని అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా సోమవారం నుంచే వసూళ్లపరంగా మరింత దూసుకెళ్లింది. సన్నీ డియోల్ నటించిన 'బోర్డర్ 2' విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ మూవీ ఫ్లాప్ అవుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ.. రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. బోర్డర్- 2కు సైతం ఎవరూ మద్దతు ఇవ్వలేదు. కానీ అది బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇండస్ట్రీ మీకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు" అన్నారు.
అలాగే ఎవరీ మద్దతు లేకపోయినా తన 'హమ్ తుమ్' (2004) మూవీ కమర్షియల్గా సక్సెస్ అయిందన్నారు. ఈ చిత్రంతో తనకు ఎదురైన అనుభవాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోని వారు నా చిత్రాన్ని మెచ్చుకునే అవకాశం లేదని.. ప్రీమియర్ షో హాజరుకావద్దని ఆదిత్య చోప్రా తనకు సలహా ఇచ్చారని ఆయన పంచుకున్నారు. కానీ సినిమాకు నేను వెళ్లానని.. అక్కడ వచ్చిన స్పందన తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు.. చాలా నిరాశతో ఆదిత్య చోప్రాకు ఫోన్ చేశా.. ఇది వాళ్లకు నచ్చే రకం సినిమా కాదని నాకు తెలుసు.. అందుకే నిన్ను వెళ్లవద్దని చెప్పానని అన్నాడు. అంటే పరిశ్రమలోని 99 శాతం మంది మీరు విజయం సాధించాలని కోరుకోరని కునాల్ కోహ్లీ స్పష్టం చేశారు. తన తొలి చిత్రం 'ముఝ్సే దోస్తీ కరోగే!' (2002) సరిగ్గా ఆడకపోయినప్పటికీ.. స్వయంగా ఫోన్ చేసి అభినందించిన రాకేష్ రోషన్ను కోహ్లీ ప్రశంసించారు.


