‘పుష్ప’ అప్‌డేట్‌.. లీక్‌ చేసిన జానీ మాస్టర్‌

Jani Master Leaked Pushpa Update - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌,  క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందనా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవలె జానీ మాస్టర్‌  కొరియోగ్రఫీ చేశారు. దీనికి సంబంధించి షూటింగ్‌ స్పాట్‌ ఫోటోలను జానీ మాస్టర్‌.. తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.  అల్లూఅర్జున్‌, సుకుమార్‌లతో పాటు మొత్తం ‘పుష్ప’ టీంతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలోనూ అల్లు అర్జున్- జానీ మాస్టర్‌ కాంబినేషన్‌లో వచ్చిన పాటలు బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా త్రివక్రమ్‌ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురం సినిమాలోనూ బుట్ట బొమ్మ సాంగ్‌ను జానీ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు.

కాగా సెట్స్ పైకొచ్చిన  మొదటి రోజు నుంచి ఈ సినిమా లీకుల బారిన పడుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సన్నివేశాలు లీకైన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన క్లిప్పింగులు ఆ మధ్య సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. తాజాగా జానీ మాస్టర్‌ సైతం సినిమాకు సంబంధించిన సెట్స్‌ను లీక్‌ చేయడంతో..రిలీజ్‌కు ముందే ఇంకెన్ని లీకులు బయటికొస్తాయో అని చిత్ర బృందం కంగారు పడుతుందట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరో ఒకరు సన్నివేశాలను రహస్యంగా ఫోన్ కెమెరాలో షూట్ చేసి లీక్ చేసేస్తుండటం యూనిట్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.


‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబోలో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’ కావడంతో ఈ సినిమపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా బన్నీ కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.  ఆగస్టు13 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

చదవండి : (పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు)
(పుష్ప రిలీజ్‌ డేట్‌పై సుకుమార్‌ అసంతృప్తి!)

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top