
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కడై (Idli Kadai Movie). ఇది తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రానుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 14న) ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్ నిర్వహించారు.
రోజూ తినాలనిపించేది
ఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ప్రతిరోజు నాకు ఇడ్లీ తినాలనిపించేది. కానీ నాదగ్గర అంత డబ్బుండేది కాదు. అప్పుడేం చేశానంటే తోటలో పూలు తెంపడానికి పనికెళ్లేవాడిని. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి త్వరగా తోటకు వెళ్లి రెండు గంటలు పనిచేసేవాడిని. అప్పుడు నాకు రూ.2 ఇచ్చేవారు. అది తీసుకున్నాక ముందు చేతి పంపు దగ్గరకు వెళ్లి రోడ్డుపైనే స్నానం చేసేవాళ్లం. తర్వాత ఇడ్లీ కొట్టుకు వెళ్తే.. ఆ డబ్బుతో నాలుగైదు ఇడ్లీలు వచ్చేవి.

హ్యాపీగా ఉంది
మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కుని తింటే వచ్చే టేస్ట్ దేంట్లోనూ రాదు. మిమ్మల్నందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలామంది అభిమానులను కలిశాను. వారిలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. నా ఫ్యాన్స్ ఇంత మంచి స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునేదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి