
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే సాధారణమైన విషయం ఏం కాదు. స్టార్ హీరోల వారసులైనా సరే సరైన మూవీస్ చేస్తేనే నిలబడతారు. లేదంటే మెల్లగా సైడ్ అయిపోతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే తెలుగులో యాంకర్గా టాప్లో ఉండే ప్రదీప్.. గత కొన్నేళ్లుగా తన ప్రొఫెషన్ని పక్కనబెట్టి హీరోగా ప్రయత్నాలు చేశాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడికే వచ్చేశాడు.
యాంకర్గా ప్రదీప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్ల నుంచి ఛానల్తో డ్యాన్స్, కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ వచ్చాడు. ఇవి చేస్తూనే అత్తారింటికి దారేది, 100% లవ్ తదితర చిత్రాల్లో సహాయ పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల తర్వాత మంచి గుర్తింపు రావడంతో హీరోగా ప్రయత్నిద్దామని '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీలో ఒక్క పాట తప్పితే సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే చిత్రంతో వచ్చాడు.
(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?)
కొన్ని నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా కూడా ప్రదీప్కి హీరోగా అదృష్టం తీసుకురాలేకపోయింది. దీంతో ఆలోచనలో పడిపోయాడు. తనకు తెలిసిన యాంకరింగ్ మళ్లీ మొదలుపెట్టేశాడు. 'కుక్ విత్ జాతిరత్నాలు' పేరుతో ఈ వీకెండ్ నుంచి ప్రారంభం కాబోతున్న కామెడీ వంట షోకి యాంకరింగ్ చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. తమిళంలో ఇదివరకే హిట్టయిన 'కుక్ విత్ కోమలి' అనే షో దీనికి స్పూర్తి. ఇందులో యష్మీ, సన్నీ, బాబా మాస్టర్, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, దీక్షా పంత్, హరి, సీరియల్ నటుడు ప్రభాకర్, ముక్కు అవినాష్ ఉన్నారు.
ప్రదీప్ మళ్లీ యాంకరింగ్ వైపు రావడం బట్టి చూస్తే హీరోగా పెద్దగా వర్కౌట్ కాలేదని రియలైజ్ అయినట్లు ఉన్నాడు. బహుశా అందుకే మళ్లీ షోలు చేయడం మొదలుపెట్టాడని అనిపిస్తోంది. ప్రదీప్ అనే కాదు సుడిగాలి సుధీర్ కూడా గతంలో ఇలానే రెండు మూడు సినిమాల్లో హీరోగా చేశాడు. కాకపోతే వీటిలో 'గాలోడు' అనే మూవీ తప్పితే మిగతావన్నీ ఆడలేదు. దీంతో ఎప్పటిలానే యాంకరింగ్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన వేడుకలో రాకింగ్ రాకేశ్)