
స్టార్ కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు అజిత్ జీవన విధానమే ప్రత్యేకం. తనూ, తన కుటుంబం, నటన, తన కారు పందేలు ఇవే ఆయన లోకం. ఇతర విషయాల గురించి పట్టించుకోరు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో జరిగే సంఘటనలపై అస్సలు జోక్యం చేసుకోరు. మొదట్లో తరచూ పత్రికల వారిని కలుసుకునే అజిత్ ఆ తర్వాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సినిమా రంగానికి ఇలా చేసిన సేవలుగాను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసింది. అలాగే కార్ రేస్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా అజిత్ ఇటీవల ఎక్కువగా మీడియాతో ముచ్చటిస్తుండటం విశేషం. అలా ఒక భేటీలో తన కార్ రేస్ పై ఆసక్తి గురించి పేర్కొంటూ తనకు చిన్నతనం నుంచి కారు రేసులంటే చాలా ఆసక్తి అని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించారన్నారు. ఆ విధంగా తాను చాలా అదృష్టవంతుడిని పేర్కొన్నారు. అయితే అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తన తండ్రి చాలా నిజాయితీగా ఒక సలహా ఇచ్చారన్నారు. కార్ రేస్ అనే క్రీడా చాలా ఖర్చుతో కూడిందని, అందువల్ల తాము నీకు తగిన సపోర్టును ఇవ్వలేకపోవచ్చని చెప్పారన్నారు.
అయితే నువ్వు స్పాన్సర్స్ను కనుగొని నీ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని చెప్పారన్నారు. అలాగే తాను పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. నువ్వు చదువు పూర్తి చేసి పట్టా అందుకోవాలన్నారు. లేదా ఏదైనా ఉద్యోగం చేయాలన్నారు. అంతేకానీ సమయాన్ని మాత్రం వృథా చేయకూడదని సలహా ఇచ్చారన్నారు. అప్పుడే తాను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నానని నటుడు అజిత్ చెప్పారు.