ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే డిజిటల్ మాధ్యమల హవానే కొనసాగుతోంది అనేది నిజం. ఈ ట్రెండ్ నానాటికీ పెరుగుతోంది కూడా.. అలా గత 27 ఏళ్లుగా మలేషియాలో ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారంగా రాణిస్తున్న నంబికై మాధ్యమం ఇప్పుడు చెన్నైలో తన శాఖను వ్యాపింపజేసింది. దీని ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఇందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు అందించారు.
శరత్కుమార్ మాట్లాడుతూ మలేషియాలో ప్రారంభించి ఇప్పుడు చెన్నై వరకు వ్యాప్తి చెందిన నంబికై డిజిటల్ మాధ్యమం నిర్వాహకులకు తన అభినందనలు అన్నారు. తన పెదనాన్న ఆదిత్తన్ ఎంతో శ్రమపడి ప్రారంభించిన పత్రిక తంది అని పేర్కొన్నారు. ఆ పత్రికలో తన తండ్రి కూడా కొంత కాలం పని చేశారన్నారు. అదేవిధంగా తాను కొంతకాలం పత్రికారంగంలో ఉన్నానని గుర్తు చేశారు. నిజాలు మాత్రమే చెప్పాలి అన్న భావంతోనే పత్రికలను నిర్వహించాలన్నారు.
గత 27 ఏళ్లుగా మలేషియాలో నిర్వహిస్తున్న నంబికై డిజిటల్ మాధ్యమం ఇప్పుడు ఇండియా, సింగపూర్ , దుబాయ్కు విస్తరించబోతున్నందుకు, మరిన్ని దేశాలకు విస్తరించి ప్రజల నమ్మకాన్ని పొందాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. రాధికా శరత్కుమార్, నాజర్, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పాల్గొన్నారు.


