బీఆర్ఎస్, సీపీఐ కలిసి పని చేస్తాయి
ప్రజలు, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఎన్నికల పొత్తు
సింగరేణి పరిరక్షణ కోసం
భవిష్యత్తులోనూ కలిసి పోరాడాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
రామకృష్ణాపూర్: స్థానికంగా నెలకొన్న పరిస్థితులతోపాటు భావసారూప్యత కలిగిన అనేక అంశాల్లో సమాలోచన విధానాలు ఉన్న సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు క్యాతనపల్లి మున్సిపాల్టీ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రకటించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రెండు పార్టీల నాయకులు కొన్ని గంటలపాటు విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఎన్నికలకే పరిమితం కాకుండా భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలన్నది తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆయన అన్నారు. క్యాతనపల్లి మున్సిపాల్టీలో 22 వార్డుల్లో 8 నుంచి 10 లేదా ఒకటి ఎక్కువో తక్కువో స్థానాలు సీపీఐకి కేటాయించే దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. సర్వే ఆధారంగా ఇరుపార్టీల బలబలాలను అంచనా వేసిన అనంతరం ఈ నెల 3న సీట్ల పంపకంపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ఏఐటీయూసీ నేత సీతారామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నా పొత్తు చర్చల సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సీపీఐని తక్కువగా చేసి మాట్లాడారని, అది తమను బాధించిందని అన్నారు. పార్టీని కాపాడుకోవడానికి బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజారమేష్, మేడిపెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.


