విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి
నస్పూర్: జిల్లాలో 5వ తరగతి నుంచి 10వ తరగతి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన నస్పూర్ కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు దుర్గాప్రసాద్, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతితో కలిసి ఎంఈఓలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా 100శాతం ఉపకార వేతనాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. రాజీవ్ విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అర్హులైన విద్యార్థులకు రూ.3500 చొప్పున ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి బాలికలకు ఒక్కొరికి రూ.1500, బాలురకు రూ.1000 చొప్పున జమ చేస్తారని తెలిపారు. వివరాలు htpp:// telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.


