సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి
ఆసిఫాబాద్అర్బన్/నస్పూర్: సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం న్యూఢిల్లీలోని సింగరేణి భవన్ నుంచి దేశంలో కోల్మైన్స్ ఉన్న జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కోల్మైన్స్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్లోజర్ మైన్స్– 2025లో భాగంగా సామాజిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ క్లోజర్ మైన్స్– 2025 కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ 25 శాతం నిధులతో సామాజిక బాధ్యతలో భాగంగా సమీప గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఆ దిశగా కలెక్టర్లు, సింగరేణి అధికారుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్, బోరుబావులు, పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువల నిర్మాణం, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో వసతులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నారు. ఆసిఫాబాద్లోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్, బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం విజయభాస్కర్, పర్యావరణ అధికారి హరీశ్, జూనియర్ ఎస్టేట్ అధికారి రజనీకాంత్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. మంచిర్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సామాజిక అభివృద్ధి కింద జిల్లాకు రూ.115 కోట్లు కేటాయించారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, గనులు భూగర్భ శాఖ ఏడీ జగన్ మోహన్, శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం వెంకటేశ్వర్లు, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


