● మున్సిపల్ ఎన్నికల్లో పైసలతోనే పని! ● అభ్యర్థుల ఎంపిక
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో పైసల ప్రాతిపదికనే రాజకీయ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు చేసే స్థాయి ఉందా..? లేదా..? అని బేరీజు వేసుకుంటూ ఎంపిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డివిజన్, వార్డుల్లో సర్వేలు నిర్వహించినప్పటికీ అంతిమంగా డబ్బులే ప్రధానంగా మారాయి. ఇప్పటికే జిల్లా కేంద్రం మంచిర్యాల కార్పొరేషన్తోసహా బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికలో డబ్బే కొలమానంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఏళ్లు కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఉన్నప్పటికీ సర్వేల్లో పనితీరు మెరుగ్గా లేదని పక్కకు పెడుతున్నారు. రిజర్వేషన్లు కలిసొచ్చినా, కోరుకున్న డివిజన్లో టికెట్ రాకపోవడంతో మరో చోట నుంచి పోటీకి దిగాల్సి వస్తోంది. దీంతో ఇన్నాళ్లుగా తాము కష్టపడిన చోట కాకుండా వేరే చోట పోటీ చేస్తే ఓట్లు వస్తాయా? రావా? అనే తర్జన భర్జన పడుతున్నారు. జిల్లా కేంద్రంలో పలు డివిజన్లలో ఈ పరిస్థితి అధికంగా ఏర్పడింది.
కార్పొరేషన్లో శ్రీమంతులకే..
జిల్లా కేంద్రం కార్పొరేషన్ పరిధి కావడంతో ఖర్చుతో కూడుకున్నది. కార్పొరేటర్గా పోటీ చేయాలంటే అభ్యర్థులకు రూ.30నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఒక్కో డివిజన్ నుంచి కనీసం 2500 నుంచి అత్యధికంగా 4వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు డబ్బులు, మద్యం తదితరాలకే భారీగా రూ.లక్షల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది. దీంతో మొదట ప్రచారం వరకు ఉన్నంతలో సొంత వనరులు వాడుకుంటున్నారు. ఇక కొందరు స్థిరాస్తులను అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఇక డివిజన్లలో టికెట్ కోసం నాయకుల నుంచి పోటీ ఉన్న చోట్ల టికెట్ దక్కిన వారు అసమ్మతిని బుజ్జగించేందుకు ఎంతో కొంత మొత్తంలో ఇవ్వాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మేయర్ స్థానం ఆశిస్తున్న వారు ఈ ఖర్చు రూ.కోట్లకు చేరుతోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో సగానికిపైగా డివిజన్లలో రియల్టర్లు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఆర్ఎంపీ తదితరులు పోటీలో ఉన్నారు.
ఖర్చుల కోసం ఆస్తులు తాకట్టు
ఖర్చుల కోసం కొందరు అభ్యర్థులు ఆస్తులను తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టి రూ.లక్షల్లో అప్పు తెచ్చుకుంటున్నారు. నెల నుంచి ఆరు నెలల గడువుతో చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. భూములు, నివాస స్థలాలు, బంగారం కుదువ పెడుతున్నారు. కొందరైతే ప్రైవేటు ఫైనాన్స్లో లోన్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ నాటికి డబ్బు కోసం ఇప్పటి నుంచే సర్దుకుంటున్నారు. టికెట్ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే పోటీలో నిలబడి గెలవడం మరో ఎత్తుగా మారింది.
అసమ్మతిపై బుజ్జగింపులు
అధికార పార్టీలో టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల అసమ్మతి నాయకులను బుజ్జగింపులు చేస్తున్నారు. మహిళా స్థానాలతో సహా జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ చోట్ల పోటీ నెలకొంది. అధికార పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు సులువుగానే అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో నామినేషన్లు వేసేందుకు పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ జిల్లా కేంద్రంలో కొన్ని చోట్ల మినహా అన్ని చోట్ల అభ్యర్థులు సిద్ధమయ్యారు. లక్సెట్టిపేట, చెన్నూరు, క్యాతనపల్లి, బెల్లంపల్లిలో వార్డుల్లో సరైన నాయకుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. కొందరు టికెట్లు రావని తెలిసీ బీ ఫాం సమర్పించే వరకు వేచి చూసి ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అవుదామనే ఆలోచనలు చేస్తున్నారు.
● మున్సిపల్ ఎన్నికల్లో పైసలతోనే పని! ● అభ్యర్థుల ఎంపిక


