బల్దియాలకు ఎన్నికల ఆదాయం
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు తప్పనిసరిగా నో డ్యూ సర్టిఫికేట్ మున్సిపాల్టీల నుంచి పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే నామినేషన్ స్వీకరిస్తారు. అభ్యర్థులను ఒకరు బలపర్చాలి, ఇద్దరు సాక్షులు ఉండాలి. కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉండరాదనే నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం వారి పేరిట ఉన్న ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ఇతరత్రా పన్నులు చెల్లించేందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాల్టీల్లో బారులు తీరుతున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద కూడా అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అన్ని పన్నులు చెల్లించాక కూడా నో డ్యూ సర్టిఫికేట్ కోసం కార్పొరేషన్లో రూ.2 వేలు, మున్సిపాలిటీల్లో రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ కార్యాలయాల్లో ఎదురు చూస్తున్నారు. అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా కలిగి ఉండాలనే నిబంధన నేపథ్యంలో ఖాతాలు తెరుస్తున్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయం బుధవారం అభ్యర్థులు, బలపర్చే వారితో కోలాహలంగా మారింది. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించేందుకు తరలి వచ్చారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఏమేం అవసరం ఉంటాయనే సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అర్హతలు, ధ్రువీకరణ పత్రాల వివరాలు వంటివి తెలుసుకున్నారు.
రికార్డు స్థాయిలో వసూళ్లు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పన్నుల రూపంలో రూ.1,30,821 వసూలైంది. గత వారం రోజుల నుంచి రూ.2,47,803 రాగా.. మున్సిపాలిటీకి మొత్తం రూ.3,78,624 ఆదాయం వచ్చిందని కమిషనర్ మురళికృష్ణ తెలిపారు.
బల్దియాలకు ఎన్నికల ఆదాయం


