జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య
రెబ్బెన: అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల మేరకు మండలం లోని గంగాపూర్కు చెందిన గుర్లె శ్యాంరావ్ (30 వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతుండగా పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తోటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మంగళవారం తెల్ల వారుజామున అతని బంధువైన గుర్లె బాపురావు తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా శ్యాంరావ్ తోటలో మంచంపై స్పృహలేకుండా కనిపించాడు. పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో పాటు నోటిలో నుంచి నురగలు వస్తుండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఎస్సై వెంకటకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఒంటరితనం భరించలేక వృద్ధుడు..
కౌటాల: మండల కేంద్రంలోని సదాశివపేట కాలనీకి చెందిన దెబ్బటి వెంకన్న (75) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై డి.చంద్రశేఖర్ తెలిపారు. వెంకన్న భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరితనంతో పాటు మానసిక వేదనతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉదయం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎస్టీపీపీ యూనిట్–1లో షడ్డౌన్
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవ ర్ ప్లాంటులో గల యూనిట్–1 (600 మెగావాట్ల) విద్యుత్ కేంద్రంలో మంగళవారం ట్యూబ్ లీకేజీల కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్–1 బాయిలర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ట్యూబ్స్ పగిలి ఉత్పత్తి నిలిచి పోగా అధికారులు మరమ్మతులు చేపట్టారు.


