నాగోబా జాతర ఏర్పాట్లు ముమ్మరం
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది ఈ నెల 18న మహాపూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాటు పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పనులను ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఏఈ భానుకుమార్ పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కేస్లాపూర్ నుంచి దస్నాపూర్ వరకు బీటీరోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నారు. కేస్లాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న మల్లాపూర్ బైపాస్ మట్టిరోడ్డుతో పాటు మెండపల్లి, హర్కపూర్ చౌక్ నుంచి మట్టిరోడ్లను పూర్తి చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో దర్బార్ ఏర్పాటు పనులు ముమ్మరం చేశారు. జాతర సమీపిస్తుండడంతో వ్యాపారులు దుకాణ సముదాయాలు, రంగుల రాట్నాలు, సర్కస్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
నాగోబా జాతర ఏర్పాట్లు ముమ్మరం


