
విద్యార్థుల సంఖ్య తగ్గేదేలే!
దండేపల్లి: మండలంలోని పెద్దపేట ప్రాథమిక పాఠశాలలో 2018కి ముందు విద్యార్థుల సంఖ్య పది మాత్రమే. అదే సంవత్సరంలో ప్రధానోపాధ్యాయురాలిగా శ్రీలత బదిలీపై వచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలను ప్రైవేటుకు పంపకుండా, వారిలో నమ్మకాన్ని పెంచి, విద్యార్థుల సంఖ్యను 60కి చేర్చారు. 2022లో మన ఊరు–మనబడి పథకంలో భాగంగా రూ.20 లక్షలు మంజూరు కావడంతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు, ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తున్నారు. ప్రతియేటా పది మంది వరకు విద్యార్థులు గురుకులాలకు ఎంపికవుతున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య 50కి పైనే తప్పా తగ్గడం లేదు.
బాల్యం గుర్తుకు వస్తది..
దండేపల్లి: మాది దండేపల్లి మండలం కాసిపేట. దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6నుంచి 10 వరకు చదివాను. 1984–85 ఎస్సెస్సీ బ్యాచ్. నాకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. నేను చదివిన దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2005–11 వరకు పనిచేశాను. మళ్లీ రెండోసారి 2018 నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. నేను రోజు బడిలో అడుగుపెట్టగానే నాకు నా బాల్యం గుర్తుకు వస్తది. చదివిన పాఠశాలలోనే పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా బాల్యం, నా ఉద్యోగ సర్వీస్, నేను చదివిన పాఠశాలలో గడుపుతున్నందుకు ఆనందంగా ఉంది.
– అప్పాల మనోహర్, స్కూల్ అసిస్టెంట్, దండేపల్లి

విద్యార్థుల సంఖ్య తగ్గేదేలే!