
ఆర్జీయూకేటీ, స్విన్ఫీ మధ్య ఒప్పందం
బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భవిష్యత్కు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు బాసర ఆర్జీయూకేటీ, స్విన్ఫీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య బుధవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఓఎస్డీ మురళీదర్శన్, స్విన్ఫీ శిక్షణ బృందంలోని సీఈవో రాణి గుంటికడి సంతకాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం గ్రామీణ యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచిందన్నారు. వీరిని ఐటీ పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయనున్నామన్నారు. ఇందులో భాగంగా ఆర్జీయూకేటీలో చివరి సంవత్సరం చదువుతున్న వందమంది విద్యార్థులకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అంశాలపై మూడునెలల పాటు ఇంటెన్సివ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మహేష్, డాక్టర్ ఎన్ విజయ్కుమార్, కంపెనీ ప్రతినిధులు సుమశ్రీ వల్లపు, రాకేష్ గంజి, మహేష్ సద్దాలా, తదితరులు పాల్గొన్నారు.