
ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
మంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే రెండు రోజుల క్రికెట్లీగ్ పోటీల కోసం ఉమ్మడి జిల్లా నుంచి క్రికెట్ జట్టు ఎంపిక చేసినట్లు హెడ్కోచ్ పి.ప్రదీప్, సెలెక్టర్లు గోదావర్తి సుధీర్, చందు, పత్తి తిరుపతి, బి.రాకేశ్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 90 మంది క్రీడాకారులు రాగా, వారిని ఆరు జట్లుగా విభజించి, ఎంపిక పోటీలు నిర్వహించామన్నారు. అందులో ప్రతిభ కనబర్చిన వారిని అండర్ 25 ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిలో మంచిర్యాలకు చెందిన సాయికృష్ణారెడ్డి, ఐ. సందీప్, ఇజాన్ అవాజ్, అశ్రిత్, ఎండీ జాంషెడ్, చరణ్, ఆసిఫాబాద్ నుంచి ఏ.సంతోష్, మందమర్రి నుంచి సింహాద్రి, రామ్యాదవ్, లక్ష్మణ్ యాదవ్, సాయి వర్మ, వేంపల్లి నుంచి సాత్విక్ పటేల్, నిర్మల్ నుంచి వినయ్, ఆదిలాబాద్ నుంచి శ్రీచరణ్, చందన్, దర్శ్ అగర్వాల్, ముసాదిక్, రాజబాబు, గుడిపేట్ నుంచి జే. సంతోష్, బెల్లంపల్లి నుంచి సుభాష్ చంద్రబోస్లు ఎంపికై నట్లు తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయించే వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్రూరల్ మండల పరిధిలోని బెల్లూరి శివారు ప్రాంతంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న గోలి మనోజ్ కుమార్పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు సోమవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దుకాణంలో తనిఖీలు చేశారు. షాపులో రెండు నకిలీ విత్తన ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఎలాంటి అనుమతి లేకుండా 227 ప్యాకెట్లను నిల్వ ఉంచాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఏవో నగేశ్ రెడ్డి, ఆర్ఐ నారాయణలు ఉన్నారు.
మద్యానికి బానిసై ఆత్మహత్య
నేరడిగొండ: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన లక్ష్మణ్ (32) మద్యానికి బానిసై సోమవారం మండలంలోని చించోలి గ్రామ సమీపంలో గల వాగులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది నుంచి లక్ష్మణ్ తాగుడికి బానిసై దొంగతనాలు చేసే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆదివారం తన పక్కింట్లో 11 గ్రాముల బంగారం దొంగలిస్తూ పట్టుబడడంతో పంచాయతీ నిర్వహించి గ్రామపెద్దలు మందలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.