మళ్లీ రేషన్ దందా
● సన్న బియ్యమూ అమ్ముతుండ్రు ● దొడ్డు బియ్యం కంటే ధర పెంచి విక్రయం ● జిల్లా దాటుతున్న క్వింటాళ్ల కొద్దీ సన్నబియ్యం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులు దొడ్డు బియ్యం వినియోగించడం లేదని రూ.కోట్లు వెచ్చించి సర్కారు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అయినా దొడ్డు బియ్యం తరహాలోనే మళ్లీ పాత దందానే మొదలైంది. గత నెలలో సన్న బియ్యం పంపిణీ మొదలు కాగా.. ఆ నెల కాస్త అక్రమ రవాణా తగ్గింది. రెండో నెల నుంచే దళారులు రంగ ప్రవేశం చేసి నల్ల బజారుకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఫలితంగా క్వింటాళ్ల కొద్దీ సన్న బియ్యం పక్కదారి పడుతోంది. దొడ్డు బియ్యానికి కిలోకు రూ.10వరకు చెల్లిస్తే సన్న బియ్యానికి రూ.20పైనే చెల్లిస్తున్నారు. గత నెలలో తాండూర్ మండలం అచ్చలాపూర్లో రేషన్ బియ్యం అమ్ముకున్నారని 11మంది రేషన్కార్డులు రద్దు చేశారు. అయినప్పటికీ జిల్లా నుంచి పెద్దయెత్తున వందల క్వింటాళ్ల కొద్దీ జిల్లా నుంచి సన్నబియ్యం తరలిస్తూ పట్టుబడడం గమనార్హం.
పాత కథేనా..!
జిల్లా నుంచి దొడ్డు బియ్యం ప్రతీ నెల వందల క్వింటాళ్లు నల్లబజారుకు తరలిపోయేది. దళారులు, మధ్యవర్తులతో రూ.లక్షల్లో వ్యాపారం నడిచేది. రోడ్డు, రైలు మార్గాల్లో మహారాష్ట్రకు రవాణా జరిగేది. తాజాగా పట్టుబడినవి పెద్దపల్లి జిల్లా గుండా వరంగల్కు తీసుకెళ్లడంతో అటువైపు ఎందుకు తీసుకెళ్తున్నారనేది స్పష్టత రావాల్సి ఉంది. టాస్క్ఫోర్స్ అధికారులు విచారణ సందర్భంగా శుక్రవారం హాజీపూర్ తదితర మండలాల్లో రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంటు, టాస్క్ఫోర్స్ బృందాలు ఉన్నప్పటికీ లబ్ధిదారులే బియ్యం అమ్ముకోవడంతో గతంలో మాదిరిగా పాత కథే నడుస్తోంది. ప్రభుత్వం సన్న బియ్యం అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నప్పటికీ జిల్లాలో దందా మాత్రం ఆగడం లేదు.
జిల్లాలో రేషన్ వివరాలు (మే నెల)
వారం వ్యవధిలో 266క్వింటాళ్లు
ఈ నెల 14న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో 211.50క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. లక్షెట్టిపేట మీదుగా వరంగల్కు ఓ లారీలో తరలిస్తుండగా పట్టుడ్డాయి. హసన్పర్తికి చెందిన ఓ వ్యక్తితో కలసి లక్షెట్టిపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమ మార్గాల్లో తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ బియ్యం హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో గ్రామాల నుంచి సేకరించినట్లు సమాచారం. ఈ బియ్యంలో కొన్ని గన్నీ సంచుల్లోనే ఉండడంతో రేషన్ డీలర్లు, లేక గోదాం నుంచే తరలించారా? అనే సందేహాలు వస్తున్నాయి.
ఈ నెల 9న జిల్లా కేంద్రంలో 108బ బస్తాల్లో 55క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను రిమాండ్ చేశారు. పట్టుబడిన బియ్యాన్ని స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. ఈ ఇద్దరు జిల్లా కేంద్రం, నస్పూర్, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల నుంచి లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం.
బియ్యం కేటాయింపు 4,313.91మెట్రిక్ టన్నులు
మళ్లీ రేషన్ దందా


