
జూరాలకు 4.66 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● స్వల్పంగా తగ్గిన వరద
● ప్రాజెక్టు 31 క్రస్టు గేట్ల ఎత్తివేత
● 4.62 లక్షల క్యూసెక్కుల నీరు
దిగువకు విడుదల
ధరూరు: ఎగువ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రాజెక్టుకు 5.37 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు 4.66 లక్షల క్యూసెక్కులకు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రాజెక్టు 31 క్రస్టు గేట్లను ఎత్తి 4.62లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 37 క్యూసెక్కులు, కుడి కాల్వకు 220 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 4,62,703 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 6.604 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
కోయిల్సాగర్లో....
దేవరకద్ర: మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు నుంచి ఇన్ఫ్లో ప్రాజెక్టుకు చేరుతోంది. శనివారం భారీగా వచ్చిన వరదతో ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఆదివారం మూడు గేట్లను, సోమవారం, మంగళవారం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదుతున్నారు.
సుంకేసులకు తగ్గిన ఇన్ఫ్లో
రాజోళి: సుంకేసుల డ్యాంకు మంగళవారం ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 29,114 క్యూసెక్కులు రాగా.. 5 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 25,747 క్యూసెక్కులు, కేసీ కెనాల్కు 2,012 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.