
చదువులమ్మ ఒడిలో.. సరిగమలు
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతోపాటు క్రీడలు, యోగా, కరాటే వంటి అంశాలను ఐచ్చికంగా నేర్చుకునే అవకాశాలు కల్పించింది. తాజాగా సంగీత పాటలు నేర్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎం శ్రీ కింద ఎంపిక కాబడిన బడులకు ముందు అవకాశం కల్పించనుంది. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలను మొదటి విడత కింద ఎంపిక చేసి సంబంధిత పరికరాలను ఆ బడులకు పంపిణీ చేశారు. ఈమేరకు విద్యార్థులు రోజు పాఠ్యాంశాల బోధనకు పరిమితం కాకుండా వారంలో ఒక రోజు సంగీత పాఠాలు నేర్చుకోకున్నారు. దీంతో పిల్లలకు శ్రావణానందంతో పాటు ఏకాగ్రత పెరగనుంది. సంగీత సాధనతో వివిధ రకాలైన కళల్లో ప్రావీణ్యం పొందనున్నారు. పిల్లలు వాటిని నేర్చుకునేందుకు మరింత ఆసక్తి చూపనున్నారు. సంగీత సాధనతో టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయా వృత్తులలో సైతం స్థిరపడేందుకు ఉపకరిస్తుంది.
శిక్షకులు వస్తే ప్రయోజనం
పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలు అంది నెల రోజులు అవుతుంది. కానీ, విద్యార్థులతో సాధన చేయించే శిక్షకులను మాత్రం ఇంకా నియమించలేదు. అన్ని రకాల వాయిద్యాలు తెలిసినవారు అరుదుగా ఉంటారు. సాధారణంగా ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి ప్రావీణ్యం ఉంటుంది. ఇలాంటి వారిని ఎంపిక చేయడం సులభమే కానీ అన్ని తెలిసిన వారికి రూ.10వేల గౌరవ వేతనం సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. భిన్న రంగాల్లో ప్రతిభ ఉన్న ఇద్దరిని నియమించి వేతన సర్దుబాటు చేస్తే పరిష్కారం లభిస్తుందని పలువురు అంటున్నారు. సంగీత పాటలు బోధించడంలో ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే సంగీత ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే సంగీత పాటలు బోధించేందుకు ఆస్కారం ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో సంగీత పాఠాలు
పీఎంశ్రీ స్కూల్స్కు వాయిద్య
పరికరాలు అందజేత
వారానికి ఒక తరగతి చొప్పున నిర్వహణ
శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక