అభివృద్ధిని చూసి ఓటేయండి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్ : ప్రజలు అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ విజ్ఞప్తి చేశారు. మానుకోట డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం సంక్షేమం, పట్టణాల అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపడుతుందని పేర్కొన్నారు. సర్వే అనంతరమే వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పోటీచేసే 32 వార్డులను కై వసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. వామపక్షాల సహకారంతోనే మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని, మొదటినుంచి సీపీఐతో పొత్తు ఉంటుందని, ఆ నేపథ్యంలోనే సీపీఐ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సీపీఎంకు నాలుగు సీట్లు ఇవ్వడంతోపాటు మరొక వార్డులో ఫ్రెండ్లీ పోటీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా సీపీఐకి కూడా నాలుగు వార్డులు కేటాయించి మరొక వార్డులో ఫ్రెండ్లీ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. ఈ క్రమంలో సీపీఐకి 6 నుంచి 7 సీట్లు కావాలనడంతో మున్సిపాలిటీలో పొత్తు కుదరలేదని తెలిపారు. ఇటీవలనే మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పోటీలో ఉన్నవారిలో 50 శాతం అభ్యర్థులు కొత్తవారేనని వారిని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ, మాజీ డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, నాయకులు ఎడ్ల రమేష్, అజ్మీర సురేష్, చిట్టోజు రవీంద్రచారి, మహేందర్ రెడ్డి, సర్పంచులు బానోత్ వెంకన్న, భూక్య వీరన్న పాల్గొన్నారు.


