ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలి
కొత్తగూడ: ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఆదర్శంగా నిలవాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని డీఎన్టీపీఎస్ గుంజేడు హెచ్ఎం సాధనాల శ్రీనివాసరావును ఆయన మంగళవారం సన్మానించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. స్కూటీనే బడి బస్సు.. మాస్టారే అక్షర వారథి శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం చదివి ఎంతో ఆనందించానని అన్నారు. తమ ఉపాధ్యాయుడు ఇంత నిబద్దతతో పని చేయడాన్ని బాహ్య ప్రపంచానికి చూపిన సాక్షి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా ఉపాధ్యాయులు కూడా విధి నిర్వహణలో చిత్తశుద్ది చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ గుమ్మడి లక్ష్మినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉత్తీర్ణత శాతం పెంచాలి
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని డీఈఓ రాజేశ్వర్ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని ఎదుళ్లపల్లి, ఓటాయి, పొగుళ్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను పుస్తకాల నుంచి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పరీక్షలు సమీపిస్తున్నందున సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు.


