
బహుబాగు..
పందిరి సాగు..
ఈ విధానపు కూరగాయల తోటలతో అధిక దిగుబడి, ఆదాయం
హన్మకొండ: పందిరి కూరగాయల తోటల ద్వారా అధిక దిగుబడితోపాటు అధిక ఆదాయం అర్జించొచ్చు. ఏడాది పొడవునా దిగుబడులు పొందొచ్చు. అందుకే పందిరి కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యాన శాఖ ద్వారా రాయితీ అందిస్తోంది. శాశ్వత పందిరి ఏర్పా టు కోసం 50 శాతం రాయితీ చొప్పున ఎకరాకు రూ. లక్ష అందిస్తుంది. ఒక రైతుకు గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తారు. శాశ్వత పందిరిపై అనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలు పండించొచ్చు. ఈ పద్ధతి కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఏడాదికి మూడు పంటలు వేసుకోవచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.
నేలలు: ఈ పంటలను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలల నుంచి తేలికపాటి బంకమన్ను వరకు అన్ని నేలల్లో పండించొచ్చు. ఎక్కువ క్షార, ఆమ్ల గుణలున్న నేలల్లో ఎదుగుదల సరిగా ఉండదు. ఈ నేలల్లో సాగుచేస్తే ఆకులు పసుపు వర్ణానికి మారుతాయి. ఉదజని సూచిక 6.0 నుంచి 6.7 ఉన్న నేలలు సాగుకు అనుకూలం. మురుగునీటి వసతి ఉండడం తప్పనిసరి. పొలాన్ని 3–4 సార్లు బాగా దున్ని తయారుచేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 టన్నుల వరకు బాగా మాగిన పశువుల ఎరువును వేయాలి.
విత్తనం విత్తే పద్ధతి: భూమి మీద పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాల్వ లకు తోడుగా మురుగు నీరు వెళ్లడానికి 2 మీ. దూరంలో కాల్వలు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటి పారుదల కోసం బోదెలను చేయాలి. అన్ని రకాల పాదులకు 3 విత్తనాలను 1–2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి.అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 10 సెం.మీ. కొలతలు గల పాలిథీన్ సంచుల్లో విత్తుకుని 15–20 రోజులు పెరిగిన తర్వాత అదునులో పొలంలో నాటుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున థైరమ్, 5 గ్రా. చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొటి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రా. విత్తనానికి 2గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడేతో విత్తన శుద్ధి చేసి విత్తాలి. విత్తే ముందు ఎకరాకు 8–10 టన్నుల పశుఎరువు, 32–40 కిలోల భాస్వరం, 16–20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని (32–40కిలోలు) రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25–30 రోజులకు, పూత, పిందె దశలో వేసుకో వాలి. మొక్కకు దగ్గరలో ఎరువు వేయొద్దు. ఎరువు వేసిన వెంటనే మట్టిని కప్పి నీరు పారించాలి.
కలుపు నివారణ, అంతరకృషి: కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2–3 తడుల తర్వాత మట్టిని గుల్లచేయాలి. ఎకరాకు పెండిమి థాలిన్ 1.2 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24–48 గంటల లోపు నేలకు పిచికారీ చేయాలి. మొక్కలు 2–4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే పూలు ఎక్కువ పూసి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. కాకర, పొట్ల పంటలను తప్పనిసరిగా పందిరి పైకి తీగలు పాకించాలి. లేని పక్షంలో పండు ఈగ బెడద ఎక్కువ ఉంటుంది. అనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు కాసి అధిక ధర లభిస్తుంది.
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి..
పందిరి కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా అందజేస్తున్న రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పందిరి కూరగాయల సాగు లాభదాయం. అధిక దిగుబడి వస్తుంది. దీంతో ఆదాయం పెరుగుతుంది. – జి.అనసూయ, ఆర్.శ్రీనివాసరావు,
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు,
హనుమకొండ, వరంగల్
పందిరి ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ
ఎకరాకు రూ. లక్ష రాయితీ
గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు అవకాశం

బహుబాగు..

బహుబాగు..

బహుబాగు..