కూరగాయలతో శివలింగాకృతులు
నందికొట్కూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూరగాయలను శివలింగాకృతులుగా చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు ఆదివారం తయారు చేశారు. వంకాయ చిలగడదుంప, ఉల్లిగడ్డ, టమాట, క్యారెట్, బీట్రూట్, బంగాళాదుంపలతో తయారు చేసిన శివలింగాకృతులను పూజ మందిరంలో ఉంచారు.
మద్యానికి బానిసై..
వెల్దుర్తి: మద్యానికి బానిసై కలుగొట్ల గ్రామానికి చెందిన ఆకుల నాగశేషు(24) ఆదివారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగశేషు, గిరిజకు నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. కుమారుడు మహేంద్ర ఉన్నాడు. నాగశేషు మద్యానికి బానిస కావడంతో భార్య తన పుట్టినూరు చెరుకులపాడుకు వెళ్లి తిరిగి రాలేదు. ఇదే సమయంలో నాగేశేషు తండ్రి మద్దయ్య శివదీక్షా పరుడై, దీక్ష విరమణకు తల్లి మద్దమ్మతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగశేషు గ్రామానికి ఆనుకుని ఉన్న సుంకులమ్మ గుడి పక్కన కల్లంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. అటుగా వచ్చిన వారు చూసి సమాచారమివ్వడంతో పోలీసులు మృతదేహాన్ని వెల్దుర్తి సీహెచ్సీకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.
నేడు ‘డయల్ యువర్
సీఎండీ, ఎస్ఈ’
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వినియోగదారులు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
కారు ఢీ కొని మహిళ దుర్మరణం
బేతంచెర్ల: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బుక్కాపురం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్ కొత్తపల్లె గ్రామానికి చెందిన నాగలక్షమ్మ (60), బుక్కాపురం గ్రామానికి చెందిన ఈరమ్మ, మధుసుధ ముగ్గురు బేతంచెర్లకు వెళ్లి ఆటోలో తిరిగి వచ్చారు. ఆటో దిగి రోడ్డు దాటుతుండగా డోన్ నుంచి బేతంచెర్ల వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగలక్షమ్మ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు గాయాలు కావడంతో బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
బోల్తా పడిన కారు
● నలుగురికి స్వల్పగాయాలు
దొర్నిపాడు: కల్వర్టును ఢీకొని ఒక కారు బోల్తాపడటంతో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. దొర్నిపాడు శివారులోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. చాగలమర్రి మండలం నగళ్లపాడు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పని నిమిత్తం దొర్నిపాడుకు కారులో బయలు దేరారు. దొర్నిపాడు చేరుకోగానే అదుపు తప్పిన కారు కల్వర్టును ఢీకొని పల్టీలు కొడుతూ రెండు విద్యుత్ స్తంభాలకు కొట్టుకోవంతో విరిగి పడ్డాయి. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరక పోవడం ఆశ్చర్యం వేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.
యువకుడి ఆత్మహత్య
ఆళ్లగడ్డ: పట్టణంలోని పుల్లారెడ్డి వీధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు పుల్లారెడ్డి వీధిలో ఉంటూ వివిధ వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. ఇందులో భాగంగా సత్యనారాయణ స్వామి (25) ఐస్ వ్యాపారం చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ యుగంధర్ తెలిపారు. కాగా ప్రేమ విఫలమై మనస్తాపం చెంది ప్రేమికుల రోజు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
కూరగాయలతో శివలింగాకృతులు


