టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా
తడకనపల్లెలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
గ్రావెల్ కోసం చేపట్టిన తవ్వకాలతో రూపుమారిన కొండ
జగనన్న కాలనీలో ఎర్రమట్టిని తవ్వుతున్న పొక్లెయిన్
కల్లూరు: కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా రెచ్చిపోతుందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన తడకనపల్లెలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను, జగనన్న లేఅవుట్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 337లో లెవలింగ్ పేరుతో గ్రావెల్ను అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తన హయాంలో నిరుపేదలకు భూములు పంపిణీ చేశామన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి టీడీపీ నాయకులు కొండ ప్రాంతాన్ని సాగులోకి తీసుకొచ్చే సాకుతో గ్రావెల్ దందా చేస్తున్నారన్నారు. పొలాన్ని సాగులోకి తెచ్చుకోవాలంటే మూడు, నాలుగు అడుగుల లోతులో చదును చేస్తారని, ఇక్కడ 15 అడుగుల లోతు మట్టిని అడ్డంగా తవ్వేస్తున్నారన్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇచ్చారు? ఇక్కడ ఎంత లోతు మట్టి తవ్వారో పరిశీలించాలన్నారు. అధికారం ఎప్పుడ్డూ శాశ్వతం కాదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అధికారులందరిపై విచారణ తప్పదన్నారు. తడకనపల్లె, పెద్దటేకూరు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదన్నారు. ట్రిప్పుకు రూ.500 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారని.. నియోజకవర్గంలో పూడిచెర్ల, ఉప్పులపాడు, తడకనపల్లె గ్రామాల్లో అక్రమ గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు.
జగనన్న కాలనీలో దురాక్రమణలు
పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే దుండగలు దురాక్రమణకు పాల్పడుతున్నారని కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడకనపల్లెలోని 86వ సర్వే నెంబర్లో జగనన్న కాలనీ పేరిట లేఅవుట్ వేశామన్నారు. గ్రామానికి చెందిన 80 మందితో పాటు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 52 వార్డుల పేద ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు చేశామన్నారు. అయితే కొందరు దుండగలు జగనన్న కాలనీలో దురాక్రమణ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆయన లేఅవుట్ను పరిశీలించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. పేద ప్రజల కోసం కేటాయించిన ప్లాట్లు కబ్జాలకు గురువుతున్నా అధికారులు మౌనం వహించడం తగదన్నారు.
15 అడుగుల లోతు మట్టి తరలింపు
పత్తాలేని రెవెన్యూ,
మైనింగ్ అధికారులు
స్వయంగా వెళ్లి పరిశీలించిన
వైఎస్సార్సీపీ నంద్యాల
జిల్లా అధ్యక్షుడు కాటసాని
జగనన్న కాలనీ ప్లాట్ల
ఆక్రమణపై ఆగ్రహం
టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా
టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా


