5న కార్తీక లక్ష దీపోత్సవం
కర్నూలు కల్చరల్: కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 5వ తేదీన కార్తీక లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సమితి కార్యాధ్యక్షులు ఇ.పద్మావతి పేర్కొన్నారు. ఆదివారం సమితి కార్యాలయంలో దీపోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదకొండు సంవత్సరాలుగా కర్నూలు నగరం వినాయక్ ఘాట్ కేసీ కెనాల్లో సామూహికంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. సమితి కార్యదర్శులు జె.రాధిక, స్వప్నసారథి, సహ కార్యదర్శులు జయలక్ష్మి, సభ్యులు అనురాధ, హేమలత, మల్లీశ్వరి, మల్లికార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నదిలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి
మంత్రాలయం రూరల్: తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి ఒక యువకుడు మృతి చెందారు. ఈ దుర్ఘటన ఆదివారం తుంగభద్ర గ్రామం పుష్కరఘాట్ వద్ద చోటుచేసుకుంది. తుంగభద్ర గ్రామానికి చెందిన వీరేంద్రగౌడ్(26) ఆదివారం ఉదయం స్నానానికి తుంగభద్ర నదికి వెళ్లాడు. పుష్కరఘాట్ వద్ద జారి నీళ్లలో పడిపోయాడు. ఈత రాక పోవడంతో నీళ్లల్లో కొట్టుకుని పోయాడు. నీళ్లల్లో కొట్టుకొని పోతున్న వీరేంద్రగౌడ్ను స్థానికులు కాపాడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. నదిలో కిలోమీటర్ మేర వరకు పోయి అక్కడ కంపచెట్లలో విగతజీవిగా కనిపించాడు. వీరేంద్రగౌడ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇంకా పెళ్లికాలేదు. తల్లి లక్ష్మీ ఈశ్వరమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నదీతీర ప్రాంతాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు (టౌన్): కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వస్తుంటారని, నదీతీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులు తమ వెంట చిన్న పిల్లలను తీసుకొని వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఓర్వకల్లు కాల్వబుగ్గ రామేశ్వర శివాలయం , బ్రహ్మగుండేశ్వరం శివాలయం, గురజాల గ్రామ శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు.
క్రీస్తు త్యాగంతోనే పాప విమోచనం
కర్నూలు (టౌన్): దేవాది దేవుడైన ఏసుక్రీస్తు లోకరక్షణార్థమై రక్తం చిందించి ప్రాణత్యాగం చేశారని, ఆయన త్యాగానికి ఫలితంగానే మానవులకు పాప విమోచన లభించిందని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ అన్నారు. కర్నూలు నగరంలోని బుధవార పేట, వెంకయపల్లెలోని క్రిస్టియన్ సమాధుల వద్ద ఆదివారం పరిశుద్ధ ఆత్మల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. క్రైస్తవులు సమాధుల తోటలో డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్ 2వ తేదీ ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. చనిపోయిన ఆత్మలను స్వర్గ ప్రాప్తి చేకూరాలన్నారు. అనంతరం సమాధులకు పవిత్ర తైలంతో పావనం చేశారు. చర్చి ఫాదర్లు ప్రతాప్ రెడ్డి, జాన్ డేవిడ్, ఆర్లప్ప. థామస్, సుధాకర్, రాజశేఖర్, ఉపదేశులు ఎన్, అంథోనీ, రాజు, మరియ దళ సభ్యులు, క్యాథలిక్ యూత్ పాల్గొన్నారు.
5న కార్తీక లక్ష దీపోత్సవం
5న కార్తీక లక్ష దీపోత్సవం
5న కార్తీక లక్ష దీపోత్సవం


