
చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు
కర్నూలు (టౌన్): ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏదీ’ అని ప్రశ్నిస్తే నాలుక మడత పెడతామన్న సీఎం చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసాలు, అరాచకాలే కనిపిస్తున్నాయన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిద్ర లేకుండా చేస్తామన్నారు. జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం అంటూ చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు, మోసాలను వివరిస్తూ ప్రచురించిన బుక్లెట్ను ఆదివారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో ఆవిష్కరించారు.
తల్లికి వందనం పేరుతో వంచన
జగన్ ప్రభుత్వం కంటే రెండింతలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తల్లికి వందనం పేరుతో వంచన చేశారని ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 87 లక్షల మంది తల్లులు ఉంటే 54 లక్షల మందికి మాత్రమే ఈ పథకం ఇచ్చారని, రాష్ట్రంలో 30 లక్షల తల్లులను వంచన చేశారన్నారు. తల్లికి వందనం ఇచ్చే సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక అన్ని హామీలు నేరవేర్చామని, ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మడత పెడతామని ప్రజలను బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఐఎఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలను జైళ్లకు పంపుతూ భయానక వాతవరణం కల్పిస్తున్నారన్నారు.
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఆందోళనలు చేయడంతో తల్లికి వందనం నిధులు అరకొరగా ఇచ్చారన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏడాదిలోపు 4 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
● ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ... సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. మూడు సిలిండర్లు, ఉచిత బస్సు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
● కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ..14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా అన్నారు. ఏడాదికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పులు చేసి, ఏ అభివృద్ధికి ఖర్చు చేశారని ప్రశ్నించారు.
● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మాట్లాడుతూ.. ఈనెల 4న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసనకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. అఽధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు చార్జీల పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల పై రూ. 15 వేల కోట్లు భారం మోపారన్నారు.
● ఎమ్మిగనూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ బుట్టా రేణుక, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయ మనోహారి మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోందన్నారు.
● వైఎస్సార్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లికి వందనం నిధులు తమ్ముళ్లకు ఇంధనంగా మారాయన్నారు. ఒకే అధార్ కార్డు మీద 120 మంది, 90 మందికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
● సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, దేవపూజ ధనుంజయ ఆచారి, కార్పొరేటర్లు షేక్ యూనుస్ బాషా, అర్షియా ఫర్హీన్, మునెమ్మ, అనుబంధ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఏడాది పాలన అంతా మోసాలు,
అరాచకాలే!
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి