
కోసిగిలో చిరుత పులి
● బంధించిన అటవీశాఖ అధికారులు
కోసిగి: మండల కేంద్రమైన కోసిగిలో ఆదివారం చిరుత పులి కలకలం లేపింది. స్థానిక బసవన్న కొండ దిగువ భాగంలోని ఎర్రవంకలో నడుచుకుంటూ వెళుతూ రైతులకు కనిపించింది. ఎర్రవాగులో ఎటూ కదలకుండా మత్తులో ఉండగా గుర్తించి ఎస్ఐ హనుమంతురెడ్డి సమాచారం అందించారు. చిరుతపులికి హాని కల్గించకుండా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఫారెస్టు ఆఫీసర్ శ్యామల, స్క్వాడ్ డీఎఫ్ఓ రవిశంకర్, ఆదోని ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ తేజస్వీ అక్కడి చేరుకుని రైతుల సహాయంతో చిరుతపులిని బోనులో బంధించారు. దానిని మత్తులోనుంచి బయటపడేందుకు నీళ్లను పోసి వాహనంలో తరలించారు. కొండ ప్రాంత నుంచి నీళ్లు తాగేందుకు చిరుతపులి కిందకు వచ్చిందని, మత్తులో ఉండడానికి కారణాలు వైద్య పరీక్ష అనంతరం తెలుస్తుందని డీఎఫ్ఓ తెలిపారు.
కార్మికుల వినూత్న నిరసన
ఎమ్మిగనూరుటౌన్: తమ సమస్యల సాధనకు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు గత 40 రోజులుగా చేపట్టిన నిరవధిక దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వ మొండి వైఖరి పట్ల నిరసన తెలిపారు. యూనియన్ నాయకులు రాజేంద్ర, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి వర్సిటీల్లో
పీజీ తరగతులు
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గత నెల 15 నుంచి వర్సిటీలకు వేసవి సెలవులు ప్రకటించారు. సెలవుల అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు మొదలు కానున్నాయి. మళ్లీ వర్సిటీల్లో విద్యార్థుల సందడి కనిపించనుంది.

కోసిగిలో చిరుత పులి

కోసిగిలో చిరుత పులి